ధర్మాన ప్రసాదరావు ఏపీలో చాలా అనుభవం ఉన్న నేత. ఏ అంశంపైనైనా సూటిగా, స్పష్టంగా మాట్లాడే సత్తా ఉన్న నేత. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయారు. నియోజకవర్గానికే లిమిట్ అయ్యారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుండీ సైలెంట్ ఉన్నధర్మాన, ఇప్పుడు సడన్ గా వాయిస్ పెంచేశారు..
ఇప్పుడు ధర్మాన మాటలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఆయన మాటల్లో ఎవరి అర్థాలను వారు వెతుక్కుంటున్నారు. ధాన్యం సేకరణ, ఉపాధి హామీ, రోడ్లు లాంటి అంశాలపై ఆయన కామెంట్స్ సొంత పార్టీ నేతలనే ఖంగు తినిపిస్తున్నాయట. సంక్షేమ పథకాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో మౌలిక వసతుల కల్పన ఆలస్యం అవుతోందన్న ఆయన, అభివృద్ధి కార్యక్రమాలపై ఇకనుంచి దృష్టి పెడతానంటున్నారు.
నిజానికి ఏపీలో కేబినెట్ ప్రక్షాళనపై అధికార పార్టీలో చర్చ భారీగానే ఉంది. చాలామంది ఆశావహులు మంత్రి పదవుల కోసం చూస్తున్నారు. ధర్మాన కూడా ఈ లిస్టులో ఉన్నారు. మరి ఆయనకు ఏ సంకేతాలు వచ్చాయో ఏమో, గుంభనంగా ఆయన చేస్తున్న కామెంట్స్ పై స్థానికంగానే కాదు… రాష్ట్ర పార్టీ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోందట. ఆయన మాటల్ని టిడిపి అనుకూలంగా వాడుకుంటే, సొంత పార్టీలో వ్యతిరేక వర్గం ధర్మానకు వ్యతిరేకంగా వాడేసుకుంటోందట..