రోడ్డుమీద నడుచుకుంటూ లేదా వాహనంపై వెల్తున్నప్పుడు రోడ్డుమీద డబ్బులు కనిపిస్తే లటక్కున జేబులో వేసుకొని మన దారిని మనం పోతుంటాం. డబ్బు అంటే చేదు అనే వారు ఎవరూ ఉండరు. తాజాగా హైదరాబాద్లో ఆటోవాలా తన నిజాయితీని చాటుకున్నాడు. అలాంటిది అక్షరాలా పది లక్షల రూపాయలున్న బ్యాగు చేతికి చిక్కినా ఆ ఆటో డ్రైవర్ ఆలోచన దారితప్పలేదు. ఆ డబ్బు తీసుకొని నేరుగా పోలీస్స్టేషన్కు వెల్లి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఆటో వాలా నిజాయితీకి పోలీసులు ఫిదా అయ్యారు.
సిద్ధిపేటకు చెందిన అన్నదమ్ములు ప్రసాద్, కిషోర్లు కిరాణా షాపు నడుపుతున్నారు. ఇంటి నిర్మాణం చేపడుతుండడంతో అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం పది లక్షల రూపాయలు తీసుకొని జూబ్లీ బస్టాండ్లో దిగారు. అక్కడ ఆటో ఎక్కి గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్ కాలనీకి వెళ్లారు. ఆటో దిగే హడావిడిలో తమ వెంట తెచ్చిన బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. కొద్దిసేపటి తర్వాత అన్నదమ్ములు బ్యాగు ఆటోలో మర్చిపోయామని గుర్తించారు. వెంటనే పోలీసుల్ని సంప్రదించగా.. వారు సీసీ ఫుటేజ్ సాయంతో ఆటో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
తన ఆటోలో మరిచిపోయిన బ్యాగ్ను డ్రైవర్ తెరచి చూడటంతో డబ్బు కట్టలు చూసి షాక్ తిన్నాడు.తన ఆటోలో వచ్చిన వారు బ్యాగు మర్చిపోయారని గుర్తించి వారి కోసం వెతికాడు. కనిపించకపోవడంతో బ్యాగును భద్రంగా తీసుకువెళ్లి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు ఆ డబ్బు సిద్ధిపేటకు చెందిన అన్నదమ్ములు డబ్బుగా గుర్తించారు. వెంటనే వారిని పిలిపించి.. డ్రైవర్ రమేష్ చేతుల మీదుగానే డబ్బు తిరిగి వారికి అప్పగించారు. రమేష్ నిజాయితీ మెచ్చిన కిషోర్, ప్రసాద్లు అతడికి రూ.10వేలు బహుమతిగా ఇచ్చారు