తెలంగాణలోని ప్రతి ఎకరం భూమినీ గోదావరి జలాలతో తడపాలన్న కేసీఆర్ సంకల్పం నెరవేరే దిశగా తొలి అడుగు పడింది. మహాద్భుత కట్టడంగా ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా 11.23 గంటలకు జాతికి అంకితమైంది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
మేడిగడ్డ పంప్హౌస్లోని 6వ నంబర్ మోటార్ను ఆన్ చేయడం ద్వారా గోదావరి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అనతి కాలంలోనే పూర్తయిన బృహత్తర బహుళార్ధక సాధక కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.
అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.