ఏపీ సీఎం జగన్ బాటలోనే నడుస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్. ప్రతీ గడపకు పాలన అందేలా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఇక పారదర్శకంగా వాలంటీర్లు సైతం పనిచేయడంతో జగన్ ప్రభుత్వ ఇమేజ్ ప్రజల్లో పెరిగిపోయింది.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యేందుకు సిద్దమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏపీ తరహాలో ప్రజలకు సంక్షేమ పథకాల సక్రమంగా అందించడానికి, ప్రజలకు సహాయంగా వాలంటీర్లను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు నేతలతో చెప్పుకొచ్చారు రేవంత్.
అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని తెలిపారు. సంక్షేమాల అమలులో యువత ప్రాధాన్యం కీలకమని..అందుకే వారినే వాలంటీర్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు రేవంత్. వాలంటీర్ తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి వినతులు తీసుకోవడం, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం కృషిచేసేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారులకు ఎంపికలో వీరిదే కీలకపాత్ర కానుంది. విద్య, వైద్య, రోడ్లు, వీధి దీపాలు, మురుగు నీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేలా వాలంటీర్ల వ్యవస్థ పనిచేయనుంది. వీరికి గౌరవ వేతనం రూ.6 వేలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.