తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రం వచ్చిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అయితే అధికారంలోకి వచ్చినా అనేక సమస్యలు అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని చుట్టుముడుతున్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు గుదిబండగా మారగా మరోవైపు నేతలకు ఇచ్చిన హామీ ప్రకారం వారికి న్యాయం చేయడం పెను సవాల్గా మారింది.
రీసెంట్గా తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా ఈ రెండు స్థానాలు కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉంది. అయితే ఈ రెండు స్థానాలకు దాదాపు 20 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రధానంగా షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తుండగా గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ని పెద్దల సభకు పంపే అవకాశం ఉంది.
త్వరలోనే హైకమాండ్తో మరోసారి భేటీ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలపై ప్రకటన చేయనున్నారు. ఇక వీరితో పాటు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టి. జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఎస్ఏ సంపత్ కుమార్, మహ్మద్ అజారుద్దీన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేష్కుమార్ గౌడ్, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, ఎన్ఎస్యూఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఎమ్మెల్సీ పదవులు ఆశీస్తుండగా ఉన్నదే రెండు సీట్లు కావడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని కేడర్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల ఎంపిక తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇప్పటికే వివేక్ కుటుంబంలో ఒకరికి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరగుతోంది. అలాగే మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీకి అవకాశం ఉండనుందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా నామినేటెడ్ పోస్టుల ఎంపిక సీఎం రేవంత్కు తలకు మించిన భారంగా మారిందనే చెప్పాలి.