సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు జనసేన పార్టీ రాజీనామా చేసిన పోతిన మహేష్. తన అనచరులతో కలిసి పార్టీలో చేరగా ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు జగన్. విజయవాడ పశ్చిమ టికెట్ ఆశీంచారు మహేష్. ఇందుకోసం మొదటి నుండి పనిచేస్తూ వచ్చారు. అయితే పొత్తులో భాగంగా ఎవరూ ఊహించని విధంగా విజయవాడ వెస్ట్ సీటును బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. ఇక్కడి నుండి మాజీ ఎంపీ సుజనా చౌదరి పోటీ చేస్తుండగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జనసేనకు రాజీనామా చేశారు పోతిన.
ఈ సందర్భంగా పవన్పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ నమ్ముకుని మోస పోయామని..అసలు ఏనాడూ పవన్ పార్టీ గురించి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జగన్పై ప్రశంసలు గుప్పించారు మహేష్. సింహంలా సింగిల్గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పయనం ఉంటుందన్నారు . జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని.. వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనని తెలిపారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఇక మహేష్ జనసేనను వీడటం ఖచ్చితంగా ఆ పార్టీకి గట్టిదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.