ఏపీ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఏపీలో బీజేపీ ఒంటరిపోరు చేస్తుందనుకోగా తాజాగా టీడీపీ – జనసేన కూటమిలో చేరేందుకు సిద్ధమైంది కమలం పార్టీ. ఇక మరోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్కు జోష్ తెచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న షర్మిల తాజాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో భేటీ అయ్యారు.
అయితే వాస్తవానికి కొణతాల..జనసేనలో చేరుతారని భావించారు. అయితే అనూహ్యంగా షర్మిలతో భేటీ కావడం ఏపీ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా స్వయంగా కొణతాల ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇక వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు కొణతాల. అప్పటినుండే షర్మిలతో పరిచయం ఉండగా తాజాగా వీరిద్దరి భేటీ మాత్రం కొత్త చర్చకు దారి తీసింది.
రాష్ట్ర విభజన తర్వాత జగన్ వెంట నడిచారు కొణతాల. అయితే 2014 ఎన్నికల్లో ఓటమి కావడంతో రాజకీయాలకు దూరం కాగా ప్రస్తుతం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పవన్తో భేటీ అవడం, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అనూహ్యంగా షర్మిలతో భేటీ కావడంతో కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరగుతోంది.