రోజువారీ పని చేసుకుంటూ పొట్ట నింపుకునే కూలీలు మంగళవారం (ఏప్రిల్ 10) తెల్లవారుజామున కూలీకి వెళ్తూ మృత్యువాత పడ్డారు. ఊరు గాని ఊరిలో కూలి పని చేసుకుంటున్న వారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ముంబయి- బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణ కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు మంగళశారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో సతారా జిల్లా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఖాంబట్కీ ఘాట్ వద్ద మూల మలుపు తిరుగుతుండగా ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పింది. రెయిలింగ్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఖండాలా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పతికి తరలించారు. ఘటన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే వాహనం అదుపు తప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కూలీలంతా కర్ణాటకలోని బిజాపూర్ జిల్లావాసులుగా గుర్తించారు. పుణెలో ఓ భవన నిర్మాణ పనులకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.