ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడంతో సీఎంగా ఈ నెల 30 జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త సీఎంకు అధికారులు కట్టుడిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేసింది.
దీంతో తాడేపల్లిలోని జగన్ నివాసం, పార్టీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు. వైసీపీ ఘన విజయం తర్వాత ఒక్కసారిగా జగన్ నివాసానికి నేతలు, కార్యకర్తల తాకిడి పెరిగింది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జగన్ నివాస ప్రాంతాన్ని పోలీసుల తమ అధీనంలోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతను పెంచిన పోలీసులు, ఆ ప్రాంతాన్నంతా మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. స్థానిక ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఇక జగన్ కాన్వాయ్ నిమిత్తం ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
మొత్తం ఆరు వాహనాల కాన్వాయ్ ని ‘ఏపీ 18పీ 3418’ నంబర్ తో అధికారులు కేటాయించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జగన్ ఇంటి ముందే నిలిచివున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) రంగంలోకి దిగి, జగన్ భద్రతను స్వయంగా చేతుల్లోకి తీసుకుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జగన్కు జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని అమలు చేస్తోంది ప్రభుత్వం.
మరో వైపు జగన్ ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్గా చంద్రబాబు సెక్యూరిటీని చూసిన అమర్లపూడి జోషిని ఏపీ పోలీస్ శాఖ నియమించింది. ప్రస్తుతం ఏపీ సెక్యూరిటీ వింగ్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.