తమిళ తంబీలు ఏది చేసినా ఐక్యతా రాగంతో చేస్తారు. తమ రాష్ట్రానికి కావాల్సిన ఏ డిమాండ్, లేదా సమస్య పరిష్కారానికయిన ఉమ్మడి పోరాటం చేస్తూ తమిళులంతా ఒక్కటే.. ఆ తర్వాతే రాజకీయ పార్టీలు అని చెబుతారు. రాష్ట్రం దాటితే తమిళులం.. అనే భావన చాటుతున్నారు. ఇప్పుడు వారికి అట్టహాసంగా ప్రారంభమయ్యే ఐపీఎల్ కన్నా మాకు కావేరీ జలాల బోర్డు కావాలనే డిమాండ్తో పోరాటం చేస్తామని తమిళ ప్రజలు ప్రకటించారు.
మాకు ఐపీఎల్ వద్దు.. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు (సీఎంబీ) కావాలని కోరుతూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలు ఇప్పుడు తార స్థాయికి చేరే అవకాశం ఉంది. తమిళనాడు రైతులు తిరుచ్చిలోని కావేరి నది ఒడ్డున రైతులు మెడలోతు ఇసుకలో పాక్షిక సమాధి చేసుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 16వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా కేంద్రం సీఎంబీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రైతులు చేపట్టిన ఈ ఆందోళనలో విద్యార్ధులు, ప్రజలు పాల్గొంటున్నారు. ఇక ఐపీఎల్ను అడ్డుకుంటామని చెప్పడంతో సర్వత్రా చర్చానీయాంశమైంది. క్రికెట్ మ్యాచ్లు చూస్తారా లేక కావేరీ జలాల కోసం పోరాడతారా అని రైతులు పిలుపునిస్తున్నారు.
ఈ పిలుపునకు యువకులు, విద్యార్ధుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయని పక్షంలో చైన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను జరగనివ్వబోమని రైతు సంఘాలు, యువకులు, విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.
ఇదే మాదిరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, రాజకీయ నాయకులు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా దిగి రావాల్సిందే. ఈ విషయాన్ని గమనించని ఏపీ నాయకులు తమ స్వార్థం కోసం ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రం తమిళనాడు చూసైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది.