కడపలో కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డేకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయనపై ఓ మహిళ బూటు విసిరిన సంఘటన చోటుచేసుకుంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేయాలని కోరుతూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఈ రోజు మంత్రిని అడ్డుకున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత నుంచి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఉక్కు పరిశ్రమ సెగ మంత్రికి తగిలింది. మంత్రిని అడ్డుకున్న రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఉక్క పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కడప ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంత కుమార్ హెగ్డే కదలకుండా లోపలే ఉండిపోయారు. కనీసం బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. వెంటనే పోలీసులు కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలను పక్కకు లాగి పడేశారు.
ఆందోళన చేస్తున్నా మంత్రి కనీసం తమ గోడు వినిపించుకోలేదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసమయంలో ఓ మహిళా కార్యకర్త అనంతకుమార్ ప్రయాణిస్తున్న కారుపై బూటు విసిరారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అరెస్టు చేశారు.