తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస్ సమీపంలో తిత్లీ తుఫాన్ తీరం దాటే సమయంలో సుమారు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు వీశాయి. దీంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి వణికిపోతున్నారు.
తీరం దాటిన సమయంలో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని దాటినప్పటికీ వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది. దువ్వాడ, విజయనగరం, ఖుర్దా స్టేషన్లలో రైళ్లు నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
భారీ వర్షం కారణంగా తూర్పుగోదావరిలోని ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. రాత్రి నుంచి వస్తున్న బలమైన అలల తాకిడికి రాక్వాల్ పలు చోట్ల విరిగిపడింది. కొన్ని బండరాళ్లు రోడ్డు పడడంతో బీచ్ చిధ్రమైంది.ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మళి మండలాల్లో కొబ్బరి, జీడి, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి.
గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరిచెట్లు పెనుగాలులకు ఊగిపోతున్నాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఉద్దానంతో పాటు సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పలాస, గార, వజ్రపుకొత్తూరు, సోంపేటలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
గాలుల బీభత్సానికి భారీ వృక్షాలు విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని ఊహించి ముందుగానే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలి బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా బారువ వద్ద పార్కింగ్ చేసిన లారీలు పడిపోయాయి. రోడ్డుపై ఏమీ కనిపించకపోవడంతో 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయాయి.