విదేశీ పెట్టుబడులను కలిగి ఉన్న ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఇ-కామర్స్ సంస్థలకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై ఎక్స్క్లూజీవ్ సేల్స్ పేరుతో అమ్మకాలు చేయకూడదంటూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏదేని సంస్థలో వాటాను కలిగి ఉంటే ఆ సంస్థ ఉత్పత్తులను విక్రయించకూడదని ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే ఎలాంటి పక్షపాత ధోరణిని అవలంబించకుండా విక్రేతలందరికీ సమాన స్థాయిలో సేవలందించాలని కూడా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో కొన్ని వస్తువుల్ని ఎక్స్క్లూజీవ్గా అమ్ముతుంటారు. ఇతర ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో, ఆఫ్లైన్లో అవి దొరకవు. ఆ ఫోన్ను ఒప్పందం కుదుర్చుకున్న ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లోనే కొనేందుకు వీలుంటుంది. ఇకపై ఇలాంటి ఎక్స్క్లూజీవ్ సేల్స్ ఆగిపోనున్నాయి.
దేశీయ సంస్థల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధాన నిబంధనలను సవరించినట్లు పేర్కొంది. విదేశీ పెట్టుబడుల దన్నుతో ఈ తరహా ఇ-కామర్స్ సంస్థలు దేశీయ సంస్థలకు గట్టి పోటీనిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఒక ఇ-కామర్స్ సంస్థకు చెందిన ఆన్లైన్ ప్లాట్ఫాంపై విక్రయ సంస్థలు 25 శాతానికి మించి ఉత్పత్తులను అమ్మే వీల్లేదు. అలాగే ఆన్లైన్ సంస్థలు తమ ప్లాట్ఫాంపై ఫలానా వస్తువును ప్రత్యేకంగా విక్రయించేందుకు విక్రయదారుతో ఒప్పందాలు కుదుర్చుకునే అనుమతి కూడా లేదని మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది.
ఈ కొత్త ఆదేశాలన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ ఆదేశాలు అమలులోకి వస్తే కేవలం 25 శాతం వస్తువులు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మిగతావి ఆఫ్లైన్లో అమ్మాల్సిందే. ఫిబ్రవరి 1 తర్వాత ఇ-కామర్స్ సైట్లల్లో ఎక్స్క్లూజీవ్ అమ్మకాలు ఉండవు. ఏ బ్రాండ్ అయినా తమ ఉత్పత్తుల్ని ఎక్స్క్లూజీవ్గా అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకునే వీలుండదు. సో… కొత్త ప్రొడక్ట్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో అందుబాటులోకి వస్తాయి