ఫస్ట్, సెకండ్ వేవ్ రచ్చ చూసిన జనాలకు థర్డ్వేవ్ అంటూ భయం పట్టుకుంది. దానికి తగ్గట్టుగానే పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగానే వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు ర్యాపిడ్ గా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వారంలో భారీగానే కేసుల పెరుగుదల కనిపించింది. అయితే ఓ పక్క కరోనా కొత్త వేరియంట్ దూకుడు మీదున్న సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగతేంటనే ప్రశ్న మొదలైంది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగాల్పి ఉంది. అయితే ఒమిక్రాన్ ఈ ఎన్నికలకు అవరోధంగా మారుతుందా అనే అనుమానాలు మొదలైన తరుణంలో ఈసీ క్లారిటీ ఇచ్చేసింది. కరోనా దారి కరోనాదే ఎన్నికల దారి ఎన్నికలదే అని ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ఈ రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ అక్కడి రాజకీయ పార్టీలతో కూడా చర్చించింది. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది.
అయితే ఎన్నికలంటే భారీ బహిరంగ సభలు, ర్యాలీలు ఉంటాయి. ఇవి వైరస్ వ్యాప్తికి కారణమౌతాయి. అందుకని ఎన్నికలు జరిగినా సభలకు మాత్రం అనుమతి ఇవ్వకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఈసీకి సూచించారట. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తో పాటు, నీతి అయోగ్ సభ్యుడు డా. వీ.కె పాల్, ఇతర ఉన్నతాధికారులు ఈసీకీ ఒమిక్రాన్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సూచనలు చేశారని సమాచారం. మామూలు రోజుల్లోనే మన వాళ్లను ఆపటం కష్టం. అలాంటిది వైరస్ వ్యాప్తి ఉన్న కాలంలో ఎన్నికల ప్రచారం, నిర్వహణ, కౌంటింగ్ ఎలా నిర్వహిస్తారో మరి?