కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. గత రెండు వారాలుగా ఎయిమ్స్ డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. వెంటిలేటర్పై ఉన్న జైట్లీ కన్నుమూసినట్లు డాక్టర్లు వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలా 7 నిమిషాలకు కన్నుమూశారు.
2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. మోదీ కేబినేట్ లో ప్రముఖ పాత్ర పోషించారు.
2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ భాజపా విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలోకి తనను తీసుకోవద్దని తెలిపారు.అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన ఎయిమ్స్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.