బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గవర్నన్ తమిళి సై సీరియస్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు. ఇంతకీ కౌశిక్ రెడ్డి- గవర్నర్ తమిళి సై మధ్య ఫైట్కి గల కారణం ఏంటంటే. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ చేసిన వ్యాఖ్యలే. ఎన్నికల ప్రచారం చివరి దశలో తన కుటుంబంతో కలిసి పాల్గొన్న కౌశిక్…తనకు ఓటు వేయకపోతే బలవన్మరణానికి పాల్పడతానని తెలిపారు. గెలిస్తే జైత్రయాత్రకు వస్తానని లేదంటే తన శవయాత్రకు అందరూ రావాలని కోరారు.
ఇక ఇవాళ జాతీయ ఓటర్ దినోత్సం సందర్భంగా మాట్లాడిన గవర్నర్ తమిళి సై…కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి గెలవాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి బెదిరించి ఓట్లు అడగడం సరికాదని చురకలు అంటించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు.
వాస్తవానికి కౌశిక్ వ్యాఖ్యలను ఆ సమయంలోనే ఈసీ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. గతంలోనూ కౌశిక్ రెడ్డి – గవర్నర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా దానిని తిరస్కరించింది తమిళి సై. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్గా ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది.