మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై నమోదైన పలు కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోల విషయంలో ప్రభుత్వానికి చుక్కెదురైంది. జీవోల విడుదలపై వివరణ అడుగుతూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది.
అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ సీఎం కెఇ కృష్ణమూర్తి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు మొత్తం 251 మందిపై వివిధ సందర్భాల్లో నమోదయిన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం వివిధ తేదీల్లో 120 జీవోలను జారీచేసింది.
ఎప్పుడైతే జీవోలు వాడుదలయ్యాయో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించటం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు గతంలో విచారణకు స్వీకరించింది. ఈరోజు పిటీషనర్ తరపు లాయర్ వాదనలు విన్న కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. నిర్ణీత గడువులోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
251 మందిపై నమోదైన కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. అయినా సరే ఆ కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని ఆయా కోర్టుల్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, వాటిలో అత్యాచారాలు, హత్యాయత్నాలు వంటి తీవ్రమైన కేసులు కూడా ఉండటంతో ఆ జీవోలపై ఇపుడు వివాదం రాజుకుంది. ప్రభుత్వం దీని మీద ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో చూడాలి.