విభజన చట్టంలో భాగంగా ఏపీకీ రావాల్సిన హామీలపై మరో సారి హోమంత్రి రాజ్ నాథ్సింగ్ వివరణ ఇచ్చారు. విభజన చట్టంలో ఉన్న వాటితో పాటు లేని వటిని కూడా అమలు చేశామని తెలిపారు. విభజన హమీలను అమలు చేయకపోతే ఏ పార్టీ కూడ వచ్చే ఎన్నికల్లో గెలవదని ఆయన స్పష్టం చెప్పారు. ప్రత్యేకహోదాతో సమానమైన నిధులు ఇస్తున్నందున ఏపీకి ప్రత్యేక హోదా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 90 శాతం అమలు చేశామని ఆయన చెప్పారు. మిగిలిన హామీలను నెరవేర్చడానికి కూడా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధిని తాము కోరుకొంటామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి సభలో ఉటంకించారు.
కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలపై కమిటీ వేశామని రాజ్నాథ్ తెలిపారు. రైల్వే జోన్కు ఏర్పాటుకు కమిటీ ప్రతికూలంగా నివేదిక ఇచ్చినా.. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే రెండోసారి కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. విశాఖ రైల్వే జోన్ స్థాపితమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నామని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ‘దేశ ప్రధాన మంత్రి, ప్రధాన మంత్రే.. ఆయన మా పార్టీ వారైనా కావొచ్చు, మరో పార్టీ అయినా కావొచ్చు. ప్రధాని ఇచ్చిన హామీల అమలుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని రాజ్నాథ్ స్పష్టం చేశారు
అమరావతి నిర్మాణం కోసం రూ.1500 కోట్లను ఖర్చు చేసిన విషయాన్ని ఆయన సభలో ప్రకటించారు. 11 సంస్థలకు గాను 10 సంస్థలను ఏపీలో ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చినా విభజన హమీలను అమలు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
ప్రత్యేక హోదా ఇవ్వలేమని రాజ్యసభ వేదికగా రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఏపీకి ఇస్తామని తెలిపారు. హోదాకు, ప్యాకేజీకి ఎలాంటి భేదాలు లేవని ఆయన వివరించారు. 14వ ఆర్థిక సంఘం ఇదే విషయాన్ని చెప్పిందని ఆయన మరోసారి గుర్తు చేశారు.