కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన గచ్చిబౌలి ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ను నిర్బంధించిన కేసులో ఆయనకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరష్కరించింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు పోలీసులు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సన్నిహితుడు సందీప్ రెడ్డి వద్ద పది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు విచారణలో భాగంగా బంజారాహిల్స్లోని విశ్వేశ్వరరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా అనుచరులు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ను నిర్భందించారు. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. దీనికి తోడు వారం రోజులుగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ కొట్టేసింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు.