జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడం రగిలిపోయిన పాక్ కు అంతర్జాతీయంగా మద్దతు కొరవడంతో తీవ్ర అసహనానికి లోనయి భారత్ లో ఉగ్రవాదులతో దాడులు చేసేందుకు వారిని ఉసిగొల్పుతోంది. ఇందులో భాగంగా పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఏజెంట్ తో పాటు ముగ్గురు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరించింది. దీంతో కేంద్రం దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐబీ తెలిపింది. దేశంలోకి నలుగురు వ్యక్తులు చొరబడినట్లు గుజరాత్ ఏటీఎస్ను ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తం చేసింది. ఈ నలుగురు వ్యక్తులు ఆఫ్గానిస్థాన్ నుంచి గుజరాత్ తీరం ద్వారా దేశంలోకి చొరబడినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
దీంతో అన్ని రాష్ట్రాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలోనే భారత్ లోకి చొరబడ్డ ఈ ముష్కరులు.. ఏ క్షణమైనా దాడులకు తెగబడవచ్చని హెచ్చరించింది.ఈ సందర్భంగా ఈ దుండగుల ఫొటోలను ఐబీ అన్ని రాష్ట్రాలకు పంపించింది.