భారత నావికాదళం మరింత బలోపేతం కానుంది. ప్రధాని మోదీ కలలు కన్న మేడిన్ ఇండియా స్కార్పియన్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి నేవీలో గురువారం భాగమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ కల్వరిని నౌకాదళానికి అప్పగిస్తూ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునిల్ లంబా సహా రక్షణశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని మాట్లాడుతూ.. ‘మేక్ ఇన్ ఇండియా’కు అద్భుతమైన ఉదాహరణ ఐఎన్ఎస్ కల్వరి నిర్మాణమని, దీని వల్ల నౌకాదళం మరింత పటిష్టమవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు కల్వరి జల ప్రవేశంతో కొత్త అధ్యాయం మొదలైందని, సముద్ర దేవతలు ఇంకా బలంగా, సురక్షితంగా ఉంచుతాయని మోదీ అభివర్ణించారు.
ఈ డీజిల్-ఎలక్ట్రికల్ సబ్మెరైన్ను ముంబైలోని మాజగాన్ డాక్యార్డ్లో నిర్మించారు. ఆరు సబ్ మెరైన్ల నిర్మాణంలో భాగంగా మొదటి జలాంతర్గామిని ప్రభుత్వం నేవీకి అప్పగించింది. కల్వరీ సబ్ మెరైన్ పరీక్ష దశలో 120 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించింది. ఫ్రాన్స్ నావల్ డిఫెన్స్ అండ్ ఎనర్జీ కంపెనీ డిజైన్ ఆధారంగా కల్వరీ నిర్మాణం జరిగింది.
.
17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దీంతో ఇప్పుడు మరో సంప్రదాయ డీజిల్-ఎలక్ట్రికల్ సబ్మెరైన్ను భారత నౌకాదళంలోకి వచ్చి చేరింది. ఇప్పటికే హిందూ మహాసముద్రంపై పెత్తనం చెలాయించాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. చైనా చేస్తున్న ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు ఐఎన్ఎస్ కల్వరి చెక్ పెట్టగలదిని భావిస్తున్నారు.
ఐఎన్ఎస్ కల్వరి 1,565 టన్నుల బరువు, 67.5 మీటర్ల పొడవు, 12.3 మీటర్ల ఎత్తు ఉండే ఐఎన్ఎస్ కల్వరి 20 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది… ఇది ఎస్ఎం 39 రకం ఎక్సాస్ క్షిపణులను కలిగి ఉంటుంది. అంతేకాదు బరువైన ఉపరితలంతోపాటు అంతర్భాగంలో శత్రువులను ఆయుధాలను గుర్తించి దాడిచేసే టార్బొడోలను అమర్చారు. ఫ్రాన్స్ సహకారంతో మజ్గావ్ డాక్ దేశీయంగా రూ.23,652 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ఐదు సంప్రదాయ జలాంతర్గాముల్లో ఇది మొదటిది. త్వరలోనే మరిన్ని జలాంతర్గాములు భారత నావికాదలంలో చేరనున్నాయి.