మధ్య నిషేధంతో మందు కోసం కష్టాలు పడుతున్నామని… ఉన్న కొన్ని దుకాణాల్లో మద్యం కోసం వెళ్లితే జనాలు భారీగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కోసం వైన్స్షాప్ ఏర్పాటుచేయాలని ఏకంగా ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మందు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికార పక్షం, ప్రతిపక్షం ఇలా అందరూ ఏకమయ్యారు. రేపొద్దున సభలో చర్చిస్తారని చెప్పారు. దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్నారు ఎన్టీఆర్. ఆ ప్రజల పక్షనా పోరాడే.. మాట్లాడే.. అసెంబ్లీ చర్చావేదికే కాదు.. దేవాలయంతో సమానం కూడా. అలాంటి చోట మద్యం దుకాణం కావాలంటూ జార్ఖండ్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ ప్రస్తావన తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో స్పీకర్ దినేష్ సాయంతో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ను ఒప్పిస్తామని ఎమ్మెల్యేలంతా ధీమాగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) నేత హేమంత్ సోరేన్ కూడా మద్దతు ప్రకటించారు.
జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మద్యం దుకాణాల లైసెన్స్ను రద్దు చేసింది. లిక్కర్ వ్యాపారం ప్రభుత్వమే నిర్వహిస్తోంది. పరిమిత సంఖ్యలో దుకాణాలు ఉండడంతో.. వాటి దగ్గర ప్రజలు పోలొమని బారులు తీరుతున్నారు. దుకాణాల ఎదుట క్యూలు పెరుగుతున్నాయి. ఈ కష్టాలు తాము పడమని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. దుకాణాలు పట్టణ శివారులో ఉండడం.. రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉండడంతో మందుబాబులు కష్టాలు పడుతున్నారు.