రెండు రోజులుగా తెలంగాణ అసెంబ్లీ లో మంత్రులు , నేతలు కొలువుతీరగా ముందు నుంచి అనుకున్నట్లు కేసీఆర్ ఈ సమావేశాల్లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేసింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అన్ని పక్షాలు బలపర్చాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో పీవీ విగ్రహం పెడుతూ, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి పీవీ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ కోరారు.
అయితే, పీవీకి భారత రత్న ఇవ్వాలన్న అంశంపై ఎంఐఎం విభేదించింది. తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సభ నుండి వాకౌట్ చేసింది. పీవీ చేపట్టిన భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పొగడ్తలు గుప్పించాయి. అయితే ఈ చర్చ సందర్భంగా సభలో సీఎల్పీ నేత భట్టి, మంత్రి కేటీఆర్ మధ్య మాట మాట పెరిగింది. చర్చ సందర్భంగా తమను పదే పదే హ్యుమిలేట్ చేయటం సరైంది కాదని, తమకు అడ్డు తగులుతున్నారంటూ భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనికి మంత్రి కేటీఆర్ మిమ్మల్ని స్పీకర్ హ్యుమిలేట్ చేయలేదని… ప్రజలే మిమ్మల్ని హ్యుమిలేట్ చేశారు కాబట్టే తక్కువ మంది గెలిచారని, అందుకే తక్కువ సమయం ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. పీవీకి భారత రత్న ఇవ్వాలన్న తీర్మానంతో సభ మంగళవారం వాయిదా పడగా, బుధవారం సభలో ప్రభుత్వం రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టబోతుంది.