సిలికాన్ సిటీగా పేరుగాంచి.. దేశంలోనే ఐటీకి మొదట గుర్తొచ్చే నగరం బెంగళూరు. కర్నాటక రాజధాని బెంగళూరు ఐటీకి మేటిగా ఉండడంతో అన్ని రాష్ట్రాల ప్రజలు కర్నాటకలో నివసిస్తున్నారు. బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఎక్కువ ఉండడం.. ఐటీ పరిశ్రమలో స్థానికతకు సంబంధం లేకపోవడంతో ఎక్కువ సంఖ్యలో నాన్ కర్నాటక వాళ్లు ఉంటున్నారు. వీరిలో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో కర్నాటకలో.. ముఖ్యంగా బెంగళూరులో ఉంటున్నారు. వారిలో తెలంగాణకు చెందిన వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో తమ కోసం.. తమ వాళ్ల కోసం తెలంగాణ భవన్ నిర్మించాలని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పను పలువురు కలిసి కోరారు. కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ) ప్రతినిధులు శుక్రవారం (ఏప్రిల్ 6) బెంగళూరులో యడ్యూరప్పను కలిసి వినతిపత్రం ఇచ్చుకున్నారు.
తెలంగాణ భవన్ నిర్మాణ అంశాన్ని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై యడ్యూరప్ప సానుకూలంగా స్పందించి ఆ విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కర్ణాటకలో అధికంగా తెలంగాణకు చెందిన వారు నివసిస్తున్నారని, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో తెలంగాణవారే ఎక్కువగా ఉండడంతో వారి సంక్షేమం దృష్ట్యా తెలంగాణ భవన్ నిర్మించాలని కోరినట్లు కేఆర్టీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్కుమార్ మక్తాల తెలిపారు.