దేశంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత బలోపేతం కానున్నాయి. కంప్యూటర్ ఎవరిదైనా, అదెక్కడున్నా.. అవసరం అనుకుంటే దాన్ని డీకోడ్ చేసేందుకు నిఘా సంస్థలకు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సంపూర్ణ ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్ను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో గురువారం కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చింది.
వ్యక్తిగత సమాచారాన్ని కూడా పరిశీలించే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దేశంలోని 10 దర్యాప్తు సంస్థలకు కేంద్ర హోంశాఖ అనుమతులిచ్చింది. దర్యాప్తు సంస్థలకు సహకరించనివారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
కేంద్ర హోంశాఖ అనుమతులిచ్చిన వాటిల్లో ఐబీ, సీబీఐ, ఈడీ, రా, ఎన్ఐఏ, డీఆర్ఐ, ఐబీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టోరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటలిజెన్స్, రెవెన్యూ ఇంటలిజెన్స్, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69(1),2000 కింద కేంద్ర హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజలతోపాటు అన్ని సంస్థలు ఉపయోగించే కంప్యూటర్లలోని ఏ సమాచారాన్నైనా పరిశీలించొచ్చు. కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన, పంపించిన, పొందిన, లేదా జనరేట్ చేసిన సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకోవచ్చు, పర్యవేక్షించొచ్చు, డీక్రిప్ట్ చేయొచ్చు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు.గతంలో వ్యాప్తిలో ఉన్న డేటాను నియంత్రించే అధికారం మాత్రమే దర్యాప్తు సంస్థలకు ఉండేది.