రాజకీయాల్లో గెలుపే అంతిమ విజయం. అందుకే విజయం వెంటే నేతలు పరిగెడుతారు. ఆ పార్టీలో చేరుతారు. మొన్నటి వరకు బీజేపీని విమర్శించి బద్ధ శత్రువుగా భావించిన టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు ఇప్పుడు అదే పార్టీలో చేరారు.
ఏపీ ఎన్నికల వేళ ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. గెలుస్తుందనుకొని టీడీపీతో సాన్నిహిత్యం నెరిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ దారుణంగా దెబ్బైపోయారు. వైసీపీని విమర్శించి టీడీపీ అధినేతపై ఉదాసీనంగా ఉన్న పవన్ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు.
అయితే ఎన్నికల తర్వాత పవన్ కు తత్త్వం బోధపడినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తానా మహాసభల్లో పాల్గొంటున్నారు. అమెరికాకు వచ్చిన పవన్ ను తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కలిశారు. వీరిద్దరి భేటి రాజకీయంగా సంచలనంగా మారింది.
అయితే అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ బీజేపీపై మాట మార్చడం తాజాగా సంచలనంగా మారింది. బీజేపీతో తనకు శతృత్వం లేదని జనసేనాని పవన్ ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పాత పరిచయంతోనే రాంమాధవ్ ను కలిసానని.. పనిచేయడమే తన చేతుల్లో ఉందని.. ఫలితాలు తన చేతుల్లో లేవని పవన్ పేర్కొనడం సంచలనంగా మారింది.
ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఇప్పుడు పవన్ లాంటి నేత అవసరం. ఇక ఓడిన పవన్ కు బీజేపీ లాంటి కేంద్రంలో అఖండ మెజార్టీ సాధించిన పార్టీ అవసరం. అందుకే వీరిద్దరూ అమెరికాలో ఇలా సీక్రెట్ గా చర్చలు జరిపారా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. జనసేనాని రాంమాధవ్ తో చర్చలు జరిపాక మాటమార్చడం చూశాక ఇప్పుడు బీజేపీతో పాత పగలు అన్నీ మరిచి పవన్ సాన్నిహిత్యానికి అడుగులు వేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.