వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలకు ఉపశమనం కలిగింది. గత పదిహేను రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగన సంగతి తెలసిందే. వినియోగ దారులకు ఊరటకలిగించేందుకు లీటర్ పెట్రోలు, డీజీల్ పై నిన్న ఒక్క పైసా తగ్గించిన ఆయిల్ కంపెనీలు ఈ రోజు కూడా ధరలను మరింత తగ్గించాయి.
లీటర్ పెట్రోల్ పై 7 పైసలు, డీజిల్ పై 5 పైసలు తగ్గించాయి. 16 రోజుల పాటు వరుసగా పెరిగి వాహనదారులకు వణుకు పుట్టించిన ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు తగ్గిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 78.35కు దిగిరాగా, ముంబైలో రూ. 86.16గా ఉంది.
మరోవైపు ఇంధన ధరల విషయంలో నిన్న పెద్ద నాటకీయమే చోటు చేసుకుంది. పెట్రోల్ ధర 60 పైసలు, తగ్గినట్టు నిన్న ఉదయం ప్రకటన వెలువడింది. ఆ తర్వాత కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గిందంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో, వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.