ఎండాకాలం రాకముందే దేశంలో పెట్రో మంటలు మండిపోతున్నాయి. ఎప్పుడూ లేనంతస్థాయిలో పెట్రోలు, డీజిల్ ధరలు శుక్రవారం రోజున ఆల్టైం గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ. 84.84, డీజిల్ రూ. 77.64గా నమోదైంది.
గత మే నెలలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 80.42 డాలర్లకు చేరుకున్న తర్వాత నెల రోజుల్లో 70.55 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు 77.42 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కోల్కత, ముంబయి, చెన్నై, హైదరాబాద్, జైపూర్, పట్నా నగరాల్లో పెట్రోలు ధర రూ.80కి తగ్గడం లేదు. పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి రాకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రభావాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పెరిగినప్పుడు మాత్రం కుంటిసాకులు చెబుతోంది.
పెరుగుతున్న చమురు ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నా ప్రభుత్వాలు కనికరం చూపించడం లేదు. నాలుగేళ్ల క్రితం ధరలు తగ్గినప్పుడు ఆదాయం పెంచుకోవడానికి విధించిన అదనపు పన్నులను ఇప్పుడు రికార్డు స్థాయి ధరల సమయంలోనూ కొనసాగించడం ఎంత వరకు సమంజసమంటూ ప్రజలు నిలదీస్తున్నారు.