తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని సైఫాబాద్ పరిధిలో భారీ నగదు పట్టుబడింది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఒక వాహనంలో రూ. 7.70 కోట్ల డబ్బు కనిపించింది. సరైన వివరాలు, రిసిప్టులు లేకపోవడంతో.. డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
సొమ్మును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ డబ్బుకు సంబంధం ఉందని భావిస్తున్న మరో ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదును ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నగదు తరలింపు వెనుక హవాలా రాకెట్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో మరో నెల రోజుల వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇంత భారీ మొత్తంలో డబ్బు దొరకడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే వీరిని కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ నగదును ఎవరికోసం తీసుకొచ్చారు? ఎవరు పంపారు? అసలు ఈ నగదు బట్వాడా వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. వీరిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరతామని తెలిపారు.