శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సులగల మహిళలు వెల్లొచ్చు అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటినుంచి కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొందరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించాలని చేసిన ప్రయత్నాలను అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్నారు. తాజాగా ఆలయంలోకి ప్రవేశించాలని చూసిన ఫాతిమా రెహానాను పోలీసులు అరెస్ట్ చేశారు.
మత విశ్వాసాలను కించరపరిచేలా, హింసను ప్రేరేపించేలా ఫేస్బుక్ పోస్ట్ చేసినందుకు కేరళలోని పత్తనంతిట్ట పోలీసులు మంగళవారం ఫాతిమాను అరెస్టు చేశారు. కొచ్చిలోని పలరివట్టంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు ఫాతిమాను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153 (ఎ) కింద ఫాతిమాపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.త నకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నవంబర్ 16న ఫాతిమా చేసిన విజ్ఞప్తిని కేరళ హైకోర్టు కొట్టేసింది.
సోషల్ మీడియాలో ఫాతిమా చేసిన మతపరమైన వివాదాస్పద పోస్టులపై పత్తనంతిట్ట పోలీసులు అక్టోబర్ 20న కేసు నమోదు చేశారు. శబరిమల ఆచార సంరక్షణ సమితి సెక్రటరీ పి.పద్మకుమార్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫాతిమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఫాతిమా సెప్టెంబర్ 30న ఫేస్బుక్లో ఒక ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఆమె అయ్యప్ప భక్తులు వేసుకునే నలుపు రంగు దుస్తులు వేసుకుంది. అలాగే మెడలో రుద్రాక్ష మాల వేసుకుని, తలపై ఇరుముడి పెట్టుకుంది. ఈ ఫొటోకు ‘తత్వమసి’ అనే క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ పోస్ట్ అయ్యప్ప భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 2004లో కొచ్చిలో జరిగిన కిస్ ఆఫ్ లవ్ ప్రచారంలో కూడా ఆమె పాల్గొంది.