సాధారణంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అని అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం అన్నీ అడుగులు వెనక్కు ఉన్నాయి. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేవలం తాత్కాలిక నిర్మాణాలు మినహా ఎలాంటి పనులు జరగలేదు. శాశ్వత నిర్మాణంపై ప్రతిపాదనలే ఇంకా ఖరారు కాలేదు. ఇక నిర్మాణం ఎప్పుడో. ఒకసారి నార్మన్ ఫొస్టర్, సింగపూర్ ఇలా ఏవేవో దేశాల ఇంజనీర్ల ప్రతిపాదనలు ఆహ్వానించారు. చివరికి బాహుబళి దర్శకుడు రాజమౌళిని పిలిచి మరీ ఆహ్వానించి రాజధాని నిర్మాణాలపై ప్రతిపాదనలు అడిగారు. అయితే ఇచ్చిన ప్రతిపాదనలు తిరస్కరించారు.
రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన మాత్రం అంగరంగ వైభవంగా చేశారు. ప్రధాని మోదీ, ఎన్డీఏ మిత్రపక్షాలు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులను పిలిచి కనుల పండువగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అది ఒక్కటి మినహా ఇప్పటివరకు రాజధాని నిర్మాణం ఒక్కటి సక్రమంగా లేదు. కేవలం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మించారు. అంతే ఏవేవో కార్యక్రమాలు అమరావతి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నా అవేంటో ప్రజలకే కాదు పాలకులకు అర్థం కావడం లేదు. రెండు, మూడు నెలలకోసారి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. నానా హడావుడి చేస్తారు.. చల్లబడతారు. ఇలా రాజధాని నిర్మాణంపై చంద్రబాబు నడిపిస్తున్న కథ.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి బాహుబళి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని పిలిపించి మాట్లాడారు. మంచి ఆకృతులు ఇవ్వాలని కోరగా రాజమౌళి దానికి తగ్గట్టుగా తన శాయశక్తిలో ఇచ్చారు. వాటిని చూసిన చంద్రబాబు మొదట్లో బావున్నాయని చెప్పి ఆ తర్వాత ప్రజల నుంచి విమర్శలు రావడంతో తిరస్కరించారు.
అయితే ఇంకా రాజధాని నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నారు. వివిధ దేశాల నుంచి ఆహ్వానాలు పలుకుతున్నారు. కానీ మన దేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి ఆహ్వానాలు స్వీకరించడం లేదు. ఒకసారి మనవాళ్లకు అవకాశం ఇచ్చి చూస్తే తెలుస్తది. మనవాళ్ల సత్తా కూడా. ఇంకా సినిమా పరిశ్రమలో గుణశేఖర్ ఉన్నాడు. మంచి మంచి సెట్టింగ్స్ వేసి సినిమాలు తీస్తుంటాడు. ఇప్పుడు గుణశేఖర్ను కూడా పిలిచే అవకాశం ఉంది.