నిన్న భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు ఈ రోజు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న సానుకూల సంకేతాలతో పాటు ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు పెరగడంతో లాభాల్లో ముగిశాయి. లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు, కొనుగోళ్ల జోరుతో మిడ్సెషన్ నుంచి మరింత ఊపందుకున్నాయి. చివర్లో ఇన్వెస్టర్లు మరింత కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఒకానొక దశలో సెన్సెక్స్ 395 పాయింట్ల మేర ఎగిసింది
ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 34,663కి పెరిగింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 10,514కు చేరుకుంది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్ల జోరుతో మార్కెట్లు ఈ మేర ఎగిసినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.
ఐటీ, బ్యాంకింగ్, ఫార్మాలు లాభాలు పండిస్తే.. ఆటో రంగం మాత్రం కాస్త నిరాశపరిచింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ 4 శాతం వరకు లాభాలు పండించగా.. టాటా మోటార్స్, గెయిల్, ఓఎన్జీసీ 4 శాతం నుంచి 7 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ మాత్రం 70 పాయింట్లు క్షీణించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా (19.07%), ఎన్సీసీ (8.80%), కావేరీ సీడ్ కంపెనీ (7.47%), ఆస్ట్రాల్ పాలీ టెక్నిక్ లిమిటెడ్ (7.00%), జస్ట్ డయల్ (6.60%).
టాప్ లూజర్స్:
జీఈ టీ అండ్ డీ ఇండియా (-8.50%), గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ (-7.31%), జెట్ ఎయిర్ వేస్ (-7.03%), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (-6.83%), టాటా మోటార్స్ (-6.56%).