టీడీపీకీ ఇది చేదువార్తే. ఆపార్టీ ఎమ్మెల్సీ, గీతం యూనివర్శటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. సోమవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తి సహా మరో ముగ్గురు మృతి చెందారు. మూర్తితోపాటు మరో నలుగురు కాలిఫోర్నియా నుంచి అలాస్కాకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహానాన్ని ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ నెల 6న గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో మూర్తి ప్రసంగించాల్సి ఉంది. అందుకోసమే ఆయన అమెరికా వెళ్లారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తానా సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1938 జులై 3న తూర్పుగోదావరి జిల్లా మూలపొలం గ్రామంలో జన్మించిన మూర్తి, ఆర్థికశాస్త్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ డిగ్రీ పొందారు. న్యాయవాదిగా, పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన రెండుసార్లు ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
గోల్డ్స్పాట్ మూర్తిగా తెలుగువారికి సుపరిచితులై ఎంవీవీఎస్, ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తొలిసారి టీడీపీ తరఫున 1989 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే, రెండేళ్ల తర్వాత జరిగిన 1991 సాధారణ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన ఉమా గజపతిరాజుపై విజయం సాధించారు. అయితే, 96,98 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.