మహానాడు జరిగిపోయింది..! పసుపు పండుగ పరిపూర్ణం అయిపోయింది. అయితే, మహానాడుకు ముందు నందమూరి హరికృష్ణ వార్తల్లో నిలిచారు. ఈసారి కాస్త ఓపెన్ అయిపోయి మహానాడుపై పరోక్ష విమర్శలు చేశారు. మహానాడుకు ముందూ మధ్యా వెనకా… ఎక్కడా వార్తల్లో కూడా ప్రస్థావనకు రానిది ఎవరంటే… జూనియర్ ఎన్టీఆర్. ఆయనకు ఆహ్వానం ఉందా లేదా ఉంటుందా ఉండదా ఉంటే వస్తాడా రాడా.. కనీసం ఇంటి ఊహాగానాలైనా గతంలో వచ్చేవి. ఈసారి అవి కూడా లేకుండా పోయాయి.
మహానాడు అంటే గుర్తొచ్చేది పెద్దాయన ఎన్టీఆర్ జయంతి. ఆ రోజును పురస్కరించుకునే మహానాడు జరుగుతుంది. ఇంతకీ ఆరోజున ఎన్టీఆర్ ఏం చేశాడూ అంటే… ఉదయాన్నే తాతకు నివాళులు అర్పించాడు. ఆ తరువాత, ఏదో పని ఉందంటూ చెన్నైకి వెళ్లిపోయాడట. సో.. మహానాడు జరుగుతుంటే ఆయన హైదరాబాద్లో లేడన్నది క్లియర్. కాబట్టి, ఎన్టీఆర్ను ఎవరైనా మహానాడుకు పిలిచారా లేదా అనే చర్చకే ఆస్కారం లేకుండా పోయింది. దాంతో మీడియాలో కూడా జూనియర్ ఏంచేస్తున్నాడన్న వాకబు వార్తలు రాలేదు.
సో… తెలుగుదేశం పార్టీకి జూనియర్ను పూర్తిగా దూరం చేసినట్టుగానే భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో దేశం పార్టీ తరఫున చంద్రబాబు, లోకేష్ల జోడీయే ప్రజల ముందుకు వెళ్తుందనేది సుస్పష్టం. ఇకపై, పార్టీ వారసుడు లోకేష్ అనేదే ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ అవుతున్నట్టు తెలుస్తోంది! కాబట్టి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఓడినా గెలిచినా ఎన్టీఆర్ గురించిన ప్రస్థావన ఉంటుందని ఆశించడం ఆత్యాశే అవుతుందని మాత్రం కొందరు పెద్దలు విశ్లేషిస్తున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ సేవల్ని కాస్తైనా వినియోగించుకున్నారు. గడచిన ఎన్నికలకు వచ్చేసరికి… జూనియర్ అవసరం వారికి లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ప్రస్థావన కూడా దేశంలో లేకుండా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా ఒక పథకం ప్రకారమే చేశారన్నది ఎవరికైనా అర్థం కాకుండా ఉంటుందా..? అయినా… భవిష్యత్తు ఎప్పుడూ మనం ఊహించుకున్నట్టో, ప్లాన్ చేసుకున్నట్టో అన్నిసార్లూ ఉండకపోవచ్చు!