సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. రాజ్యాంగ నిపుణులతో చర్చలు అనంతరం వెంకయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరాయి. సదరు నోటీసులను అంగీకరించాలా, వద్దా అనేదానిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో వెంకయ్య మాట్లాడారు. ఒక దశలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని కూడా సంప్రదించినట్లు సమాచారం. మూడు రోజుల తర్జనభర్జన తర్వాత చివరికి ‘నోటీసులు తిరస్కరిస్తున్నట్లు’ చెప్పారు.
రాజకీయ ఉద్దేశాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నంద వల్లే అభిశంసన నోటీసును తనంతట తాను తిరస్కరించే అధికారం రాజ్యసభ చైర్మన్కు ఉందని, గతంలో మాదిరి కమిటీని నియమించాల్సిన అవసరం లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించాలని కాంగ్రెస్ సహ ఇతర ప్రతిపక్షాలు నోటీసు ఇవ్వడం దురదృష్టకరమని రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానించారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అధికార దుర్వినియోగం చేశారన్న అరోపణల్లో బలం లేదని, ఆయన ఎక్కడా దుష్ప్రవర్తనకు పూనుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అభిశంసనకు నోటీసు ఇచ్చారని అత్యధిక శాతం రాజ్యాంగ, న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని అధికార బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఒకవేళ అభిశంసన తీర్మానం నోటీసులను ఉపరాష్ట్రపతి తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నది.