అప్పటికే పుష్కరముహూర్తం మొదలై రెండు గంటలు గడిచాయి. ఉదయం ఆరు గంటలా ఇరవై ఆరు నిమిషాలకే పుష్కరాలు మొదలవుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ముందుగా వీఐపీలు, స్వామీజీలు పుష్కర స్నానాలు చేశారు.
ఇదే పెను విషాదానికి దారి తీసింది. ఏకంగా కొన్ని వందల మంది గాయాలపాలయ్యారు. పుష్కర ముహూర్తం మొదలైన తర్వాత దాదాపు రెండు గంటల సేపు అన్ని పుష్కర ఘాట్లనూ మూసి వేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులందరి స్నానం కోసం అంటూ ఘాట్లను మూసి వేశారు.
వారి స్నానాలు ముగిసేంత వరకూ యాత్రికులెవ్వరినీ ఘాట్ల వద్దకు అనుమితించలేదు. ఒక్కసారి వీఐపీల స్నానాలు ముగియగానే.. ఘాట్లను ఒక్కసారిగా తెరిచారు. అప్పటికే దాదాపు రెండు గంటల సేపటి నుంచి వేచి ఉండి అసహనానికి లోనయిన భక్తులు ఒక్కసారి దూసుకు వెళ్లారు. దీంతో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకొంది. వందల మంది క్షతగాత్రులయ్యారు. వారిలో పదుల సంఖ్య మంది మరణించారు.
ఈ ఘాతుకానికి ఒక విధంగా వీఐపీ ట్రీట్ మెంటే కారణమని.. అలాగే కోటిలింగాల ఘాట్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ప్రచారం చేయడం… రాజమండ్రి ని వేదికగా చేసుకొని పుష్కరాల గురించి ప్రచారం చేయడంతో.. ఇక్కడికి యాత్రికుల సంఖ్య అమాంతం పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో.. ఈ దారుణం చోటు చేసుకొంది.