ఇప్పుడు ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ మార్కెట్ హవా కొనసాగుతోంది. ఇంట్లోనే ఉండి షాపింగ్ చేసే అవకాశం ఉండడంతో అందరూ స్మార్ట్ఫోన్ తీసుకొని ఆర్డర్లు చేసేస్తున్నారు. గంటల వ్యవధిలో ఇంటి ముందు వాలిపోతారు. పైగా మంచి మంచి ఆఫర్లు ఉండడంతో అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇందులో మోసాలు కూడా ఉన్నాయి. వినియోగదారులను బురిడీ కొట్టించే ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అయితే మోసపోయిన వారి జాబితాలో ఏకంగా ప్రస్తుత ఉప రాష్ట్రపతి కూడా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన్నే పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆన్ లైన్లో మోసపోయారు. వెయిట్ లాస్ (బరువు తగ్గడం) యాడ్ చూసి.. ఆర్డర్ బుక్ చేసి చేతులు కాల్చుకున్నారంట. ఈ విషయాన్ని తానే స్వయంగా రాజ్యసభలో చెప్పడం విశేషం. ఆరోగ్యానికి సంబంధించి ఆన్లైన్లో జరుగుతున్న మోసాలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ లేవనెత్తిన అంశంపై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు వెంకయ్యనాయుడు.
ఉప రాష్ట్రపతి కాకముందు.. ఆన్లైన్లో ఓ ప్రకటన చూశారంట. 28 రోజుల్లోనే బరువు తగ్గొచ్చని అని ఉండడంతో రూ.1,230 చెల్లిస్తే ట్యాబ్లెట్స్ పంపిస్తాం.. 28 రోజులు వాడితే బరువు తగ్గుతారు అని ఉంది. వెంటనే ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించి ఆర్డర్ చేశా. ట్యాబ్లెట్స్ వచ్చాయి. తీసి చూస్తే.. అసలైన ట్యాబ్లెట్స్ కావాలంటే మరో రూ.వెయ్యి చెల్లించాలని ఉందంట. అసలు విషయం అప్పుడు తెలిసింది. వెంటనే తన సిబ్బంది ద్వారా సంబంధిత మంత్రికి లేఖ రాయగా విచారించిన వారు ఇది అమెరికా ప్రకటన అని.. ఇక్కడి వారికి కాదని సమాచారం ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన ప్రాడెక్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంత పెద్దమనిషి.. అన్నీ తెలిసిన వెంకయ్యనాయుడు గారినే నమ్మించారంటే.. సామాన్యుల ఇంకెలా మోసపోతున్నారో ఈ ఎగ్జాంపుల్ చాలు..