విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేసును కేంద్ర ప్రభుత్వ సంస్థతో, స్వచ్ఛంద విచారణ జరిపించాలని కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సిట్ కేసును రాజ్యాంగ కోణంలో కాకుండా రాజకీయ కోణంలో విచారణ జరుపుతోందని ఆయన ఆరోపించారు. కేసును కేంద్ర ప్రభుత్వ సంస్థతో, స్వచ్ఛంద విచారణ జరిపించాలని కోరారు. జగన్ దాఖలు చేసిన రిటి పిటిషన్లో ఆయన మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ, విశాఖ విమానాశ్రయం స్టేషన్ హౌస్ అధికారి, జగన్పై దాడి కేసు విచారణ జరుపుతున్న సిట్ ఇన్చార్జి, కేంద్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ప్రతివాదులుగా చేర్చారు. ప్రభుత్వం, పోలీసులు కలిపి కేసును పక్కదోవ పట్టిస్తున్నారని పిటిషన్లో జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
పదునైన కత్తితో దుండగుడు తనపై దాడి చేశాడని, ఈ దాడి నుంచి తాను త్రుటిలో తప్పించుకున్నానని, తాను కిందికి వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలోకి గుచ్చుకుందని, దీంతో ప్రాణాపాయం తప్పిందని వైఎస్ జగన్ పిటిషన్లో తెలిపారు.
ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వ సంస్ధతో విచారణ జరిపించాలంటూ వైసీపీ నేతలు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో జరిగితే నిజాలు బయటకు రావని వారు అనుమానం వ్యక్తం చేశారు.
పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఇది హత్యాయత్నమని తేలింది. వేర్వేరు హ్యాండ్ రైటింగ్లతో ఉన్న పదిపేజీల లేఖను వారు విడుదల చేసి.. ఘటన జరిగిన గంటలోనే ఓ ప్లెక్సీని తెరపైకి తెచ్చారు. అతను వైఎస్సార్సీపీ అభిమాని అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. హత్యాయత్నాన్ని కప్పిపుచ్చేలా సీఎం, డీజీపీల ప్రకటనలు ఉన్నాయి. ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై నాకు నమ్మకం లేదు.