వైసీపీకి, బీజేపీకి మధ్య ఏదో సంబంధం ఉందని నమ్మించేందుకు చంద్రబాబు సతమతమవుతుంటే . ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఆ పనిలో శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు రాసింది.
ఏపీ భవన్ వద్ద బుగ్గన, ఆకులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను( ఇద్దరూ కలిసి ఉన్న విజువల్స్ కాదు.. ఒక్కొక్కరుగా లోనికి వస్తున్న విజువల్స్) ప్రసారం చేస్తూ కథనం రాసింది. బుగ్గనను బీజేపీ పెద్దల వద్దకు ఆకుల తీసుకెళ్లారని.. పీఏసీ చైర్మన్గా తాను గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమాలను గురించి బీజేపీ పెద్దలకు వివరించారని కథనం రాసింది.
ఈ కథనంపై ఆకుల సత్యనారాయణ మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తప్పుడు కథనాలు రాసి టీడీపీకి మేలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. బుగ్గనను అమిత్ షా, రాంమాధవ్ వద్దకు తాను తీసుకెళ్లినట్టు నిరూపిస్తే దేనిపైనా రెడీ అని సవాల్ చేశారు. దమ్ముంటే చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ, విమర్శలు చేస్తున్న మంత్రులుగాని వాటిని నిరూపించాలని ఆకుల సవాల్ చేశారు.
టీడీపీ అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ బతుకుతోందని ఆకుల విమర్శించారు. ఏపీ భవన్లో బుగ్గన రాజేంద్రనాథ్తో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ముచ్చట్టు పెట్టారని మరి దాన్ని ఎందుకు ప్రచారం చేయడం లేదని ఏబీఎన్ను ప్రశ్నించారు. సమయం కూడా తేడాగా ఉన్న సీసీ ఫుటేజ్ సాయంతో తప్పుడు కథనాలు రాసిన ఏబీఎన్పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు.