టీడీపీ చీఫ్ చంద్రబాబు ముందున్న దారులన్నీ మూసుకుపోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి బాగోతం అంతా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజధాని నిర్మాణంలో అవినీతి, అమరావతి ఇన్నర్ రింగ్ మళ్లింపు,ఫైబర్ నెట్ పనుల్లో అవినీతి, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఇలా చంద్రబాబుకు మెడకు ఒక్కొక్కటి చుట్టుకున్నాయి. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ కుంభకోణంలో చంద్రబాబు ప్రధాన పాత్రదారు అని…విచారణలో ఇదే తేలిందని చెప్పారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.
సాక్షులను ప్రభావితం చేయకుండా ముందస్తుగా చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో లోకేష్ని సైతం విచారిస్తామని వెల్లడించారు. ఎలాటి పెట్టుబడులు పెట్టకుండానే రూ.371 కోట్లు దారి మళ్లాయని చెప్పారు సంజయ్. ఎలా దారి మళ్లాయి..విదేశాల నుండి దేశానికి ఎలా వచ్చాయి అనేది చంద్రబాబు నుండి విచారణలో రాబట్టాల్సిన అవసరం ఉందన్నారు.
చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ స్కామ్ జరిగిందని…ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్కు కేబినెట్ అప్రూవల్ కూడా లేదన్నారు. ఇక ఈ కేసులో కీలక పత్రాల మాయం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని తెలిపారు. అలాగే కీలకంగా ఉన్న ఇద్దరు మనోజ్, శ్రీనివాస్లు విదేశాలకు పారిపోయారని వీరిని భారత్కు తీసుకొచ్చేలా సీఐడీ బృందాలు అక్కడికి వెళ్లనున్నాయని తెలిపారు.
ఆర్ధిక నేరం కేసులో ఆరోపణలు రుజువైతే దాదాపు 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు ముందున్న దారులన్ని క్లోజ్ అయినట్లేనని అంతా భావిస్తున్నారు.