పీలో ప్రత్యేక హోదా పోరు ఉధృతమయ్యింది. పార్టీ జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి అంతా ఒక్కటయ్యారు. హోదా ఆకాంక్షను కేంద్రానికి తెలియజెప్పేలా స్వచ్చంధంగా రోడ్డెక్కారు. ప్రత్యేక హోదా సాధన సమితి హైవేల దిగ్బంధానికి పిలుపుతో సమరభేరి మోగించారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల్ని దిగ్బంధించి నిరసన తెలుపుతున్నారు. తెదేపాతో పాటు, వైకాపా, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి.
అన్ని జిల్లాల్లో హైవేలను దిగ్బంధించడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కూడా శాంతియుతంగా ఆందోళనలకు ఓకే చెప్పడంతో టీడీపీ శ్రేణులు కూడా రోడ్డెక్కారు. విజయవాడలో ఎంపీల పోరాటానికి మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కోల్కతా చెన్నై హైవేపై బైఠాయించారు. వామపక్ష నేతలు వీధి నాటకాలతో కేంద్రం తీరును ఎండగట్టారు. రాబోయే రోజుల్లో హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు హోదా సాధన సమితి నేతలు. ఇప్పటికైనా ప్రధాని కళ్లు తెరిచి ఏపీకి స్టేటస్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.