ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఇప్పటికే జగన్ ప్రజాసంకల్పం పేరుతో పాదయాత్రను చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ఓడించి అధికారంలోకి రావాలని పట్టుదలతో జగన్ ఉన్నారు. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలను అమలు కచ్చితంగా అమలు చేస్తామని ప్రజలకు వివరిస్తున్నారు.
జగన్ పాదయాత్రలో ఉంటే 2019 ఎన్నికల్లో జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఓడించేందుకు చంద్రబాబు భారీ స్కెచ్ వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికోసం భారీ స్కెచ్ వేశారు బాబు.
పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అని అందరికీ తెలిసిన సంగతే. విజయం తప్ప అపజయం ఎరుగని కుటుంబం వారిది. ఆ కంచుకోటను బద్దలు కొట్టేందుకు పచ్చ పార్టీ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకొని జగన్ను దెబ్బ కొట్టాలని పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. జగన్ను ఓడించేందుకు కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు. జగన్ను నాలుగు వైపుల నుంచి బంధించాలని కసిగా ఉన్నారు.
పులివెందులలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పులివెందుల నియోజకవర్గ ఇన్ చార్జి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, పార్టీ శిక్షణా కేంద్రం డైరెక్టర్ రాంభూపాల్ రెడ్డితో ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశమై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించారు.
నియోజకవర్గ అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలతో పాటు. .రాజకీయంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా చర్చించారు. ‘ప్రభుత్వ పరంగా ఏం చేయాలో తాను చేస్తానని, పార్టీ పరంగా ఏం చేయాలో క్షేత్రస్థాయిలో మీరు చేయాలి’ అని ఆదేశించారు. నియోజకవర్గంలోని రైతులను ఆదుకునేందుకు సాగునీరు ఇస్తానని వారికి సీఎం హామీ ఇచ్చారు.
ప్రధానంగా నియోజరవర్గ అభివృద్ధికి కావాల్సిన అన్నీ పనులు, పథకాలను పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించారు. అంతర్గత విబేధాల వల్ల నియోజకవర్గంలో పార్టీ నష్టపోతోందని నేతలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను ఓడించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దని చంద్రబాబు నాయకులకు సూచించారు. త్వరలో పులివెందులలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జగన్కు షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.