టీడీపీతో పొత్తు ప్రభావంతో త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ ఖాలీ అవుతుందా అనే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తమ రాజకీయభవిష్యత్ కోసం భవిష్యత్ ఉన్న పార్టీల వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
రాష్ట్రవిభజన తర్వాత ఏపీ ప్రజలు కాంగ్రెస్కు సమాధి కట్టారు. తెలంగాణాలో ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఏపీలో కూడా పొత్తు ఉంటుందనే ఆశలు కాంగ్రెస్ నేతల్లో చిగురించాయి. 2019 ఎన్నికల్లో ఇరు పార్టీలుకూడా పొత్తు ఉంటుందని సంకేతాలిచ్చారు. అయితే తాజాగా కాంగ్రెస్ అధిష్టానం ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో నేతలు ఖంగుతిన్నారు. దీంతో ఇతర పార్టీలవైపు చూస్తున్నారు.
ఇప్పటి వరకు టీడీపీతో పొత్తుతో ఎన్నికలకు వెల్తే ఎన్నో కొన్ని సీట్లు దక్కించుకోవాలని పార్టీ నేతలు భావించారు. అధిష్టానం ఒంటరి పోరుకు మొగ్గు చూపడంతో గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు.కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని… త్వరలోనే ఆయన టీడీపీ లేదా వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. కోట్ల బాటలోనే మరో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా గోడ దూకేందుకు సిద్దమయ్యింది.
ఆమె త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. గత కొంత కాలంగా వైసీపీలో చేరుతున్నారనే వార్తలు వచ్చినా ఆమె క్లారిటీ ఇవ్వలేదు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కాండతో ఆమె ఫ్యాన్ కిందకు చేరిపోవాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె వైసీపీలో చేరికపై వైఎస్ జగన్ తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
వీరితో పాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న మరో కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు వంటి సీనియర్ నేతలు కూడా ఎన్నికలలోపె ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పాటు జనసేన కూడా కాంగ్రెస్ కీలక నేతలను ఆకర్షించేందుకు రంగంలోకి దిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కీలక నేతలు హస్తానికి హ్యాండ్ ఇస్తే… ఎక్కువమంది నాయకులు అదే బాటలో నడిచి కాంగ్రెస్ ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. పోటీకి నిలబెట్టడానికి నేతలే దొరకనప్పుడు ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ చెప్పడం హాస్యాస్పదం.