రాజకీయ నేతలు పార్టీలు మారడం కొత్త కాదు.. ప్రజలకు తెలియనిది కాదు. కానీ కొందరు వ్యక్తులు పార్టీలు మారినప్పుడు అందరూ అటువైపే చూస్తారు.. దాని గురించే మాట్లాడుతారు. కారణం పూర్వాశ్రమంలో వారు చేసిన రాజకీయాలు.. వారి కుటుంబ నేపథ్యం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అలాంటి టాపికే నడుస్తోంది. కారణం దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం. ప్రకాశం జిల్లాకు చెందిన పేరొందిన పొలిటికల్ ఫ్యామిలీ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్ కూడా జగన్ తో భేటీ కోసం లోటస్ పాండ్ కు వచ్చారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ దగ్గుబాటి ఫ్యామిలీని లోటస్ పాండ్ కు తీసుకువచ్చారు.
ఎన్టీఆర్ అల్లుడైన దగ్గుబాటి… చాలా కాలం టీడీపీలోనే ఉన్నా… చంద్రబాబు ఎపిసోడ్ కారణంగా ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. మారుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదనే చెప్పాలి. అయితే దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి ఇప్పుడు బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. మరి దగ్గుబాటితో పాటు ఆమె కూడా పార్టీ మారతారా? లేదా? అన్న ప్రశ్నకు అవసరమైతే ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు అన్న సమాధానం దగ్గుబాటి నుంచి వచ్చింది.
అయితే ఉన్నట్టుండి దగ్గుబాటి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నా.. దీని వెనుక చాలా గ్రౌండ్ వర్క్ జరిగినట్టు సమాచారం. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ టికెట్ ను దగ్గుబాటి కుమారుడు హితేశ్ కు ఇవ్వాలన్న దిశగా దగ్గుబాటి ఫ్యామిలీ జగన్ ముందు డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో పర్చూరును దగ్గుబాటి ఫ్యామిలీకి కేటాయించే విషయంలో జగన్ కూ పెద్దగా ఇబ్బందేమీ లేదనే చెప్పాలి.
తన కుమారుడు వైఎస్ జగన్ తో కలిసి ప్రయాణించబోతున్నారని జగన్తో భేటీ అనంతరం దగ్గుబాటి ప్రకటించారు. ఇందుకు తన సతీమణి పురందేశ్వరి బీజేపీలో ఉన్న అంశం ఏమాత్రం అడ్డంకి కాబోదన్నారు. దీనిబట్టి త్వరలోనే హితేష్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారనేది పక్కాగా తెలుస్తోంది.
ఇక రోజురోజుకు మారుతున్న రాజకీయాన్ని చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ బలపడుతోందని టీడీపీ క్యాంప్లో కలవరం ప్రారంభమైంది. దగ్గుబాటి ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు. అందుకే ఇప్పటికే ఆ పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. కానీ ఈ విషయాలన్ని మళ్లీ వెన్నుపోటు ఎపిసోడ్ దగ్గరికి తీసుకెళ్తుండటంతో గట్టిగా వాదించలేని స్థితిలో ఉంది టీడీపీ.