మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లు ఇంకా రాలేదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హాలియా మండలం అనుముల గ్రామంలో జానారెడ్డి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నాయి. తమ ఊరికి భగీరథ నీళ్లు ఇంకా రాలేదన్న జానారెడ్డి మాటలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్న జానారెడ్డి.. మిషన్ భగీరథ పథకంపై శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలో గడిచిన మూడేళ్ల నుంచి ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. జానారెడ్డి ఇంటికీ అందిస్తున్నామని.. సీనియర్ నాయకులుగా ఉండి అలా మాట్లాడటం తనకు బాధగా ఉందని వెల్లడించారు. రోడ్డు నిర్మాణం కారణంగా పట్టణంలో జానారెడ్డి ఇంటితో పాటు అందరి ఇళ్లకీ రెండు రోజుల నుంచి నీటి సరఫరా ఆగిపోయిందని వివరించారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సీఎం పుట్టినరోజు కానుకగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పారు. ‘ఆకుపచ్చ తెలంగాణ’ లక్ష్యంగా మొక్కలు నాటాలని సూచించారు. 2015 నుంచి ఇప్పటి వరకు అటవీ శాఖ లెక్కల ప్రకారం 4 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడించారు.