కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. అతిరథ మహారథులు, భారీ సంఖ్యలో హాజరైన జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల సందోహం మధ్య బెంగళూరులోని విధాన సౌధ ఆవరణలో బుధవారం (మే 23) సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
సీఎం కుమారస్వామిపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప విమర్శలు గుప్పించారు. అధికార దాహం, దురాశతో కాంగ్రెస్-జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి ఉండలేవని, మూడు నెలలకు మించి ఈ ప్రభుత్వం నిలబడదని జోస్యం చెప్పారు.
కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. కుమారస్వామి ప్రమాణస్వీకారం నేపథ్యంలో బెంగుళూరులో బీజేపీ నిరసన దినాన్ని నిర్వహించింది. కర్ణాటక ఎన్నికల్లో 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోవడం తెలిసిందే.
ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ లేకున్నా హడావుడిగా 17వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప… రెండు రోజులకే పదవికి రాజీనామా చేశారు.