మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో వున్న ఎస్ఐ పై చేయిచేసుకున్నారన్న ఆరోపణలపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు కొల్లు నివాసానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
కొల్లు రవీంద్ర అరెస్టును టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి అక్రమాలను అడ్డుకున్న బీసీలను కేసులతో వేధిస్తారా అని నిలదీశారు. సీఎం జగన్ బీసీ వ్యతిరేకి అని ఆరోపించారు.
కొల్లు రవీంద్ర అరెస్టు బీసీలపై కక్ష సాధింపులకు నిదర్శనమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అక్రమాలను అడ్డుకున్నందుకే కొల్లును అరెస్టు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీల అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయని అచ్చెన్నాయడు విచారం వ్యక్తం చేశారు.
కొల్లు రవీంద్ర అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చెప్పారు. అరెస్టులతో బెదిరించాలని చూస్తే మరింత పోరాడతామని హెచ్చరించారు. ఎంత అణిచినా ఉప్పెనలా టిడిపి సైన్యం పోరాడుతుందని స్పష్టం చేశారు.
“ఓం నమః శివాయ”.. మహాశివరాత్రి విశిష్టత..!