ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై కేసు నమోదు చేయాలని హైకోర్టు అనంతపురం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు సూచించింది.
ఏడాది ఫిబ్రవరి 7న వైఎస్సార్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, తదితరులు తమ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణతో కలిసి పేరూరు వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నాడన్న అక్కసుతో పరిటాల శ్రీరాం స్థానిక టీడీపీ కార్యకర్తలు యర్రప్ప, మాదాపురం శంకర్, కె.పరందామ యాదవ్ తదితరులు నారాయణపై మారణాయుధాలతో దాడి చే సిన సంగతి తెలిసిందే.
తనపై దాడి చేశారని పరిటాల శ్రీరాం, ఇతర టీడీపీ నేతలపై నారాయణ లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదు చేసినా ఆయనపై కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో నారాయణ పోస్టు ద్వారా తన ఫిర్యాదును జిల్లా ఎస్పీకి పంపారు. అయినా శ్రీరాంపై కేసు నమోదు చేయలేదు. దీంతో నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి విచారణ జరిపారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్రెడ్డి ఫిర్యాదుదారు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరాం తదితరులపై కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని అనంతపురం పోలీసులను ఆదేశించారు.