కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయం మరో మలుపు తిరిగింది. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు ఐటీ భారీ శాఖ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సిద్ధరామయ్యను నీరుగార్చేలా ఆదాయ పన్ను శాఖ (ఐటీ) వర్గాలు ప్రభుత్వానికి నోటీసులు పంపాయి.
మార్చి 31వ తేదీతో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి త్రైమాసికంలో రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చేసిన భారీ చెల్లింపుల వివరాలను తమకు పంపాలని నోటీసుల్లో కోరాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు ఐటీ నోటీసులు పంపింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఖర్చు పెట్టేలా పలువురు కాంట్రాక్టర్లకు సిద్దరామయ్య ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు చెల్లించిందనే బీజేపీ నాయకుల ఆరోపణల నేపథ్యంలో ఐటీ నోటీసులు అందడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే ఈ నోటీసులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ స్పందించారు. అన్ని వివరాలను ఐటీ శాఖకు అందించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, ఐటీ శాఖకు అన్ని వివరాలూ అందజేస్తామని ప్రకటించారు.
అయితే ఈ నోటీసులపై కాంగ్రెస్ విమర్శించింది. ఎన్నికల్లో ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ విధంగా నోటీసులు పంపిస్తున్నారని విమర్శించారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో నంబర్ వన్ అని విమర్శించారు. పర్సంటేజీలు కూడా చెప్పి తీవ్ర విమర్శలు చేశారు.