జనసేన అధినేత పవన్ తన చెన్నై పర్యటనలో జగన్, బాబుపైనా నిప్పులు చెరిగారు. ఓవైపు చంద్రబాబు గొప్ప వ్యక్తి అని పొగుడుతూనే … ఆయనపై సెటైర్లు వేశారు. ఆయన ఎప్పుడు స్నేహితుడిగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని అన్నారు. చంద్రబాబుతో ప్రయాణం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
బాబుకు రిటైర్ మెంట్ వయసు దగ్గరకు వచ్చేసిందని సెటైర్స్ వేశారు. చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకుంటారని అందువల్లే తన కుమారుడిని దొడ్డిదారిన మంత్రిని చేశారని విమర్శించారు. చంద్రబాబు తనయుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేడని అలాంటిది ఆయనను పంచాయతీరాజ్ శాఖ మంత్రి అవడం మన ఖర్మన్నారు. అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని భావించి 2014లో ఏపీలో టీడీపీకి మద్దతు పలికామని చెప్పారు.
జగన్పైనా విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందంటున్నవ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో వైసీపీతో జనసేన పొత్తు ఎందుకు పెట్టుకుంటుందని, వారి అవినీతి, చేతకానితనం గురించి రోజు విమర్శిస్తున్నానని పవన్ అన్నారు.
తనకు కావాల్సింది రాష్ట్రప్రయోజనాలేనని తెలిపారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలు కోసం తాను పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ జగన్ బీజేపీని కానీ కేంద్రాన్ని కానీ ప్రశ్నించడం లేదన్నారు. కేవలం తనపై కేసులు ఉన్నాయన్న భయంతోనే జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదన్నారు.
వైసీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నానని టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తాను పట్టించుకోనని అన్నారు. 2019లో పోటీకి దిగుతున్నామని పవన్ చెప్పారు. బీజేపీ, వైసీపీ లాంటి పార్టీలతో పొత్తు ఉండదని చెప్పారు.